
Railway Minister Ashwini Vaishnaw
రైల్వే జోన్ హామీకి కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్ రద్దంటూ కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్న నేపథ్యంలో.. ఆయన స్పందించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఎలాంటి వదంతులు నమ్మొద్దన్నారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. భూసేకరణ పూర్తై.. భూమి కూడా అందుబాటులో ఉందని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.
రైల్వే జోన్ రాకుంటే రాజీనామా:వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
విశాఖ రైల్వే జోన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెప్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీ పునర్విభజన చట్టంలో రైల్వే జోన్ గురించి స్పష్టంగా చెప్పారని అన్నారు. మంగళవారం కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో రైల్వే జోన్ అంశమే చర్చకు రాలేదని తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వంపై అక్కసుతోనే తప్పుడు రాతలు రాస్తున్నారని ఆరోపించారు.
రైల్వే జోన్పై అవాస్తవాలను ప్రచురించి వారి స్థాయిని దిగజార్చుకోవద్దని హెచ్చరించారు. విశాఖకు రైల్వే జోన్ వచ్చి తీరుతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. శాఖకు రైల్వే జోన్ రాకుంటే రాజీనామా చేస్తానని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014కి సంబంధించిన అపరిష్కృత సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంగళవారం (సెప్టెంబర్ 27) రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులతో కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మతో పాటు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య వివాదాలపైనా ఈ సమావేశంలో చర్చ సాగింది. 14 అంశాలను ఈ సమావేశం ఎజెండాలో చేర్చారు. ఏడు అంశాలు రెండు రాష్ట్రాలకు చెందినవి. మరో ఏడు అంశాలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి ఉన్నాయి.