
cm jagan
- నాడు- నేడు, విద్యాకానుక, ట్యాబ్ లపై సీఎం జగన్ సమీక్ష
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలపై సీఎం జగన్ ఫోకస్ సారించారు. సోమవారం నాడు- నేడు, విద్యాకానుక, ట్యాబ్ ల పంపిణీ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాడు –నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్లపై నిర్వహించిన ఆడిట్ వివరాలను అధికారులు సీఎంకు అందించారు. సీఎం జగన్ మాట్లాడుతూ నాడు– నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్లపై నిరంతరం, నెలకోసారి ఆడిట్ చేయాలని సీఎం ఆదేశించారు. స్కూళ్లకు కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా లేదా అనేది పరిశీలించాలన్నారు. అవసరమైన చోట వెంటనే పనులు, మరమ్మతులు చేయించాలని స్పష్టం చేశారు. స్కూల్ మెయింటనెన్స్ ఫండ్ ను వాడుకుని స్కూళ్ల నిర్వహణలో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా తెలియజేయడానికి వీలుగా 14417 టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
విద్యాకానుకపైనా సీఎం సమీక్ష
వచ్చే ఏడాది జూన్ లో స్కూళ్లు తెరిచే సమయానికే విద్యాకానుక కింద అన్ని రకాల వస్తువులూ అందించేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నామని అధికారులు తెలిపారు. స్కూళ్లు తెరిచే నాటికే పిల్ల చేతికి విద్యాకానుక కచ్చితంగా అందాలని సీఎం ఆదేశించారు. యూనిఫామ్స్ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లోకి వేయాలని సూచించారు. స్కూళ్ల నిర్వహణలో పేరెంట్ కమిటీలను యాక్టివేట్ చేయాలని సీఎం ఆదేశించారు. స్కూళ్ల అభివృద్ధి, నిర్వహణలపై తరచుగా వారితో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్ క్లినిక్ ద్వారా పరిధిలోకి తీసుకురావాలని మరోసారి పునరుద్ఘాటించారు. వీటిపై ఎప్పటికప్పుడు విలేజ్ క్లినిక్ ద్వారా నివేదికలు పంపించాలని సూచనలు చేశారు. నివేదికలను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలని, దీంతో పారిశుధ్య లోపం వల్ల, నీటిలో నాణ్యతా లోపం వల్ల వచ్చే రోగాలను చాలా వరకు నివారించడానికి అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులు భాగస్వామ్యం కానున్నారు. ప్రతివారం స్కూళ్లను వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసులు, నెలకోసారి ఏఎన్ఎం సందర్శించనున్నారు. ఎవరెవరు ఏం చేయాలనే దానిపై ఎస్ఓపీ తయారు చేశామని అధికారులు వివరించారు. స్కూళ్ల నిర్వహణలో తమ దృష్టికి వచ్చిన అంశాలను ఫొటోగ్రాఫ్ లతో సహా అప్ లోడ్ చేయడానికి ముగ్గురు సచివాలయ సిబ్బంది పని చేస్తారని తెలిపారు. వీటిపై వెంటనే తగిన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. మండల స్థాయిలో ఉాండే విద్యాశాఖ అధికారుల్లో(ఎంఈఓ) ఒకరికి అకడమిక్ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణ అంశాలు అప్పగించాలని సీఎం సూచించారు.
టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీపైనా..
ఎనిమిదో తరగతి విద్యార్థులు, పాఠాలు బోధించే టీచర్లకు మొత్తం 5,18,740 ట్యాబ్ లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఆ ట్యాబ్ లలో బైజూస్ కంటెంట్ అప్ లోడ్ చేసి అందించనుంది. అలాగే తరగతి గదులను డిజిటలీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా స్మార్ట్ టీవీలను, ఇంటరాక్టివ్ టీవీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంపై సమీక్ష చేసిన ముఖ్యమంత్రి జగన్క కు దాదాపు 72,481 యూనిట్లు అవసరమని అంచనా వేసినట్లు అధికారులు వివరించారు. దశల వారీగా వీటిని తరగతి గదుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ. 512 కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి తొలి దశలో తరగతి గదుల డిజిటలైజేషన్ జరిగేలా చూడాలని, అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే డిజిటల్ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ అన్నింట్లో కూడా ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్, స్కూల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఎ. మురళి ఇతర ఉననతయధికారులు పాల్గొన్నారు.