
round table conference
మూడు రాజధానుల అంశం ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తుంది. ఒకవైపు అమరావతి రైతులు రాజధానికోసం పాదయాత్ర చేస్తుంటే.. మరోవైపు మూడు రాజధానుల కోసం ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొన్నిరోజులుగా ఉత్తరాంధ్ర విద్యార్థులు రాజధాని కోసం పోరుబాట పట్టారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర రాజకీయ నాయకులు ఈ నెల 25న విశాఖలో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలోని ఎంవీపీ కాలనీ సమీప గాదిరాజు ప్యాలెస్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరే వారు నుంచి సలహాలు, సూచనలను తీసుకోనున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుని అమరావతి రైతులు పాదయాత్ర విరమించుకుంటే మంచిదని నాయకులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికే పాలనా వికేంద్రీకరణపై సమావేశం ఏర్పాటు చేసిన చెప్పారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇది రాజకీయ సమావేశం కాదని.. స్థానిక నేతలుగా తాము ఏర్పాటు చేస్తున్నామన్నారు.
అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర.. చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తోందన్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిల్చేందుకే చంద్రబాబు ఈ పాదయాత్ర చేయిస్తున్నారన్నారు. ఈ యాత్ర ఢిల్లీ వరకు చేయించినా నష్టం లేదని.. తాము అమరావతికి వ్యతిరేకం కాదన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని 2018లో బీజేపీ రాయలసీమ డిక్లరేషన్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకుండా ఉండేందుకే మూడు రాజధానుల విధానాన్ని తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని.. అంతే తప్ప అమరావతికి తామెవరమూ వ్యతిరేకం కాదన్నారు.