
పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేందుకు రూపొందించిన యూపీఐ ఒక విప్లవాత్మక నిర్ణయం. సురక్షితంగా, అత్యంత సులభంగా, లావాదేవీ వ్యయం లేకుండా నగదును బదిలీ చేసుకునే వీలుండటం దీని బలం. కానీ, యూపీఐ లావాదేవీలపైనా ఛార్జీలను వసూలు చేసేందుకు ఉన్న అవకాశాలను ఆర్బీఐ పరిశీలిస్తోంది. ఈ నిర్ణయంపై ప్రజాభిప్రాయం కోరుతూ ‘చెల్లింపుల వ్యవస్థల్లో ఛార్జీలు’ అనే చర్చా పత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనిపై అక్టోబరు 3 లోపు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా కోరుతోంది.
సాధారణంగా క్రెడిట్ కార్డు లావాదేవీలు నిర్వహించినప్పుడు మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) ఛార్జీలను విధిస్తుంటారు. ఎండీఆర్ తరహాలోనే లావాదేవీ మొత్తంపై నిర్ణీత శాతాన్ని రుసుముగా వసూలు చేయాలా? లేదా లావాదేవీకి స్థిరంగా కొంత మొత్తం వసూలు చేయాలా అన్న విషయాన్నీ చర్చా పత్రంలో పేర్కొంది ఆర్ బీఐ.
డిజిటల్ చెల్లింపుల సేవలు అందించేందుకూ కంపెనీలకు కొంత ఖర్చు అవుతోంది. దీన్ని వ్యాపారులు లేదా వినియోగదారులు భరించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గతంలోనే పేర్కొంది. ఇందుకు విధించే ఛార్జీల వల్ల డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు అవరోధం ఏర్పడకూడదనీ భావిస్తోంది. అందుకే డిజిటల్ చెల్లింపుల సేవలను వినియోగించే అందరి నుంచీ అభిప్రాయాలు సేకరించేందుకే చర్చాపత్రం తీసుకొచ్చిందని బ్యాంకింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. యూపీఐ ఆధారిత చెల్లింపులు ప్రస్తుతం రోజుకు 21 కోట్లకు పైగా జరుగుతున్నట్లు అంచనా. ఎన్పీసీఐ జులై గణాంకాలను పరిశీలిస్తే.. మొత్తం 338 బ్యాంకులు యూపీఐ లావాదేవీల్లో పాలుపంచుకున్నాయి. 628.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.10,62,991.76 కోట్లు.