
cm ys jagan
క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే అధికారులకు కొన్ని సూచనలు చేశారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ జాబితాలోకి కొత్త చికిత్సలు చేరికను సీఎం జగన్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. కొన్ని సంప్రదింపులు మిగిలి ఉన్న దృష్ట్యా.. సమయం కావాలని అధికారులు కోరారు. దీంతో అక్టోబరు 15 న ఆరోగ్య శ్రీ జాబితాలోకి మరిన్ని ప్రొసీజర్ల చేర్చే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీంతోపాటు ఫ్యామిలీ డాక్టర్ పైలెట్ ప్రాజెక్టును కూడా సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో 2,446 చికిత్సలు ఉండగా.. కొత్త వాటి చేరికతో చికిత్సలు 3,254కు చేరనున్నట్లు వెల్లడించారు.
ఆరోగ్య శ్రీ, అనుబంధ సేవల కింద చేస్తున్న ఖర్చు.. గత ప్రభుత్వంతో పోలిస్తే ఏడాదికి దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు సీఎం జగన్ చెప్పారు. పెరిగిన ప్రొసీజర్లతో ఏడాదికి ఆరోగ్య శ్రీకి సుమారుగా రూ.2,500 కోట్లు, ఆరోగ్య ఆసరాకోసం సుమారు రూ.300 కోట్లు, 108, 104లకోసం సుమారు మరో రూ.400 కోట్లు చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా దాదాపు రూ.3200 కోట్లు వరకూ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104లకోసం ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు సీఎం జగన్.
మరికొన్ని 104 వాహనాలు
ఇప్పటికే రాష్ట్రంలో 104–వాహనాలు 676 వరకు సేవలకు అందిస్తున్నట్లు చెప్పారు సీఎం జగన్. డిసెంబర్ నాటికి మరికొన్ని కొత్త వాహనాలు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. విలేజ్ క్లినిక్స్లో 12 రకాల వ్యాధి నిర్ధారణ కిట్లు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు చెప్పగా.. కోవిడ్ కిట్ కూడా అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో తగిన స్థాయిలో సిబ్బంది ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం ప్రతినెలా కూడా ఆస్పత్రుల వారీగా ఆడిట్ చేయాలలని సూచించారు. ఈ ఆడిట్ నివేదికలు ప్రతి నెలాకూడా అధికారులకు చేరాలన్నారు.
ఎక్కడ ఖాళీ వచ్చినా వెంటనే మరొకర్ని నియమించే ప్రక్రియ నిరంతరం కొనసాగించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా చూసేందుకు, నిరంతరం ఈ ప్రక్రియను మానిటర్ చేసి తగిన చర్యలు తీసుకునేందుకు మెడికల్ రిక్రూట్మెంట్బోర్డు ఏర్పాటు ఆలోచన కూడా చేయాలన్నారు.
పేషెంట్ డైట్ ఛార్జీల పెంపు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్ డైట్ ఛార్జీలను పెంచాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్య శ్రీ పేషెంట్ల తరహాలోనే రోజుకు రూ.100లకు పెంచాలన్న సీఎం, నిశితంగా పరిశీలన చేసి మంచి మెనూ ఇవ్వాలని సూచించారు. జూనియర్ డాక్టర్ల స్టై ఫండ్ పెంపుపైనా చర్యలు తీసుకోవాలన్నారు.
కొత్త మెడికల్కాలేజీల నిర్మాణంపైనా..
మెడికల్ కాలేజీల నిర్మాణపనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. అర్బన్హెల్త్ క్లినిక్స్ల నిర్మాణం నవంబర్ నెలాఖరుకల్లా పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు.
ఏపీకి 6 ఆయుష్మాన్ భారత్ అవార్డులు..
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆయుష్మాన్ భారత్ అవార్డుల్లో 6 అవార్డులు ఏపీకే వచ్చాయని సీఎంకు అధికారులు వివరించారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వచ్చిన గుర్తింపు ఇది అని వివరించారు.