
TTD
మేఘా ఇంజినీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజీఎల్ )పది ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందజేయనుంది. సామాన్యులకు నాణ్యమైన జీవనాన్ని అందించాలనే లక్ష్యంతో ముందడుగు వేసే ఎంఈఐఎల్.. ఇప్పుడు మరోసారి అదే లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి 10 ఎలక్ట్రిక్ బస్సులను అందిస్తోంది. భక్తుల కోసం ఈ బస్సులను తిరుమల కొండపైన నడపనున్నారు.
ఓలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కే వీ ప్రదీప్ శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి తో తిరుమల లోని అన్నమయ్య భవన్ లో సమావేశం అయ్యారు. ఎంఈఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పి వీ కృష్ణా రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి పది విద్యుత్ బస్సులను అందించేందుకు ఆశక్తిని కనపరుస్తూ రాసిన లేఖను ఈ సందర్భంగా ప్రదీప్ టీటీడీకి అంద చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ పది బస్సులను టీటీడీకి అందిస్తామని ఈ సందర్భంగా ప్రదీప్ తెలిపారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ కంపెనీకి ఉన్నాయని, అందుకే గత 32 సంవత్సరాలుగా కంపెనీ దినదినాభివృద్ధి చెందుతూనే ఉందని తెలియజేశారు.
తిరుమలలో భక్తులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఈ పది బస్సులు చేరుస్తాయి. తొమ్మిది మీటర్ల పొడవు ఉండే ఈ ఎయిర్ కండీషన్డ్ బస్సులో డ్రైవర్తో కలిపి 36 సీట్లు ఉంటాయి. ఎలక్ట్రానిక్గా కంట్రోల్ చేసే ఎయిర్ సస్పెన్షన్ సౌకర్యం ఉంటుంది. సీసీటీవీ కెమెరాలు.. ఎమర్జెన్సీ బటన్, ప్రతీ సీటుకు యూఎస్బీ సాకెట్ ఉంటుంది. లీథియం ఐయాన్ బ్యాటరీలు ఉన్న ఈ బస్సులు ఒక్కసారి చార్జి చేస్తే ట్రాఫిక్, ప్యాసింజర్ లోడ్లను బట్టి 180 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. హైపవర్ ఏసీ, డీసీ చార్జింగ్ సిస్టమ్ వల్ల బ్యాటరీ కేవలం మూడు గంటల్లోనే చార్జ్ అవుతుంది.
ఓలెక్ట్రా విద్యుత్ బస్సుల తయారీ సంస్థ అధికారులతో సమావేశం అనంతరం.. టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి బస్సులో ప్రయాణించి పరిశీలించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. పది ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి అందించేందుకు ముందుకు వచ్చిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు. తిరుమల కొండ పై పర్యావరణ పరి రక్షణకు ఈ బస్సులు ఎంతో దోహదపడతాయని అన్నారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనేక ప్లాస్టిక్ రహిత చర్యలు చేపట్టామని, అందులో భాగంగా కొండపై సామాన్య భక్తుల కోసం నడుస్తున్న ఉచిత ధర్మరథ బస్సుల స్థానంలో పది ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామని సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతి తిరుమల మధ్య ఇప్పటికే పది ఎలక్ట్రిక్ విద్యుత్ బస్సులను నడుస్తున్నాయని, తిరుమలలో భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరిచేలా చర్యలు చేపడుతున్నామన్నారు.