
cm jagan review
క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గృహనిర్మాణంలో పురోగతిని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. వర్షాలు తగ్గినందున వేగంగా పనులు ముందుకు సాగుతాయని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో గృహనిర్మాణం కోసం రూ.5,005 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
విశాఖలో మంజూరుచేసిన ఇళ్ల నిర్మాణాలపైనా ప్రత్యేక దృష్టిపెడుతున్నామని సీఎం జగన్ కు అధికారులు వివరించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విద్యుద్దీకరణ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. టిడ్కో ఇళ్లలో ఇప్పటికే 40,576 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ కల్లా 1,10,672 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగిస్తామని చెప్పారు. మార్చికల్లా మరో 1,10,968 ఇళ్లు అప్పగిస్తామని, ఫేజ్–1కు సంబంధించి దాదాపుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసిందని సీఎం జగన్ కు వివరించారు అధికారులు.
టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు అధికారులు. వేయి ఇళ్లకు పైగా ఉన్న చోట్ల రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇళ్ల నిర్వహణపై వారికి అవగాహన, మార్గదర్శకాలు సూచిస్తున్నామని వెల్లడించారు. పరిశుభ్రంగా నిర్వహించడం, శానిటేషన్, విద్యుత్ దీపాల నిర్వహణ, వీధి లైట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణ తదితర అంశాలపై అసోసియేషన్లకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ స్పందించారు. టిడ్కో ఇళ్లు నిర్వహణ బాగుండాలన్నారు సీఎం జగన్. వాటిని పట్టించుకోకపోతే మళ్లీ మురికి వాడలుగా మారే ప్రమాదం ఉంటుందన్నారు. ఏ రకంగా ఆ ఇళ్లను నిర్వహించుకోవాలన్నదానిపై అసోసియేషన్లకు బాసటగా నిలవాలన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీఎస్హెచ్సీఎల్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, ఏపీ టిడ్కో ఛైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, సీసీఎల్ఏ సెక్రటరీ ఏ.ఎండీ. ఇంతియాజ్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ లక్ష్మీషా, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.