
Home Minister Taneti Vanita
- జైళ్ళ శాఖపై హోంమంత్రి తానేటి వనిత సమీక్ష
రాష్ట్రంలోని వివిధ జైళ్ళలో శిక్షననుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన తెచ్చేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హోం శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక నేరాల జోలికి పోనిరీతిలో ఖైదీలను తీర్చిదిద్దాలన్నారు. అందుకోసం శిక్షా కాలంలోనే ఖైదీలకు తగిన స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వాలని, జైలు అధికారులు పూర్తిగా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ జైళ్ళలోని పరిస్థితులపై అమరావతి సచివాలయంలో మంత్రి తానేటి వనిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ సెంట్రల్ జైళ్ళు,సబ్ జైళ్ళు సహా ఇతర జైళ్ళలోని స్థితిగతులను జైళ్ళ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా జైళ్ళలో ఉండే ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఖైదీల సత్ప్రవర్తనకు జైళ్ళ అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. అదే విధంగా జైళ్ళలో సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయా అని జైళ్ళ సూపరింటెండెంట్లను అడగ్గా చాలా వరకు అందుబాటులో ఉన్నట్టు అధికారులు మంత్రికి వివరించారు. జైళ్ళలో సిబ్బంది పరిస్థితులు ఇతర అంశాలపైనా సమీక్షించారు.
ఖైదీలకు సంబంధించి ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఆమె అడిగి తెల్సుకున్నారు. ఖైదీలకు నైపుణ్య శిక్షణ ఏ విధంగా ఇస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. శిక్షా కాలం పూర్తయ్యాక జైలు నుండి బయటకి వచ్చిన వారు మరలా నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలిగే విధంగా వారి నడవడికలో పూర్తి మార్పులు తీసుకువచ్చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అంతేగాక జైలు నుంచి విడుదలైన వెంటనే ఏదొక ఉపాధి అవకాశం పొందే రీతిలో జైలులోనే ఖైదీలకు తగిన ఉపాధి శిక్షణ అందించాలని హోంమంత్రి తానేటి వనిత జైళ్ళ అధికారులను ఆదేశించారు.
అనంతరం హోంశాఖ ముఖ్యకార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర కారాగారాలు, జిల్లా జైళ్ళు, సబ్ జైళ్ళలో గల ఖాళీల భర్తీ తోపాటు తగిన వాహనాలు సమకూర్చాల్సిన అవసరం ఉందని హోంమంత్రి దృష్టికి తెచ్చారు.
జైళ్ళ శాఖ డీజీ హసన్ రాజా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్ళలోని పరిస్థితులను హోంమంత్రికి వివరించారు. ముఖ్యంగా వివిధ జైళ్ళలోని ఖైదీలకు నిబంధనల ప్రకారం అందిస్తున్న ఆహారం, కల్పిస్తున్న వసతుల గురించి వివరించారు. ఖైదీలకు అందిస్తున్న వివిధ ఉపాధి శిక్షణా కార్యక్రమాలు, ప్రాథమిక విద్య, వయోజన విద్యా కార్యక్రమాల గురించి తెలియజేశారు. రాష్ట్రంలోని నాలుగు కేంద్ర కారాగారాల్లో 8 నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఉన్నాయని, వాటి ద్వారా ఖైదీలకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణను అందిస్తున్నట్టు తెలిపారు. బీఆర్ ఆంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం నుంచి ఇద్దరు ఖైదీలు బంగారు పతకాలు సాధించారని వివరించారు.
ఈ సమీక్షా సమావేశంలో హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్, జైళ్ళ శాఖ డీఐజీలు డా. వరప్రసాద్, కిరణ్ లతో పాటు వివిధ కేంద్ర కారాగారాల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.