
-
రూ. 270 కోట్లతో మహీంద్రా గ్రూప్ ఇథనాల్ ప్లాంట్ కు సీఎం జగన్ శంకుస్థాపన
-
బ్రోకెన్ రైస్ తో ప్లాంట్ లో ఇథనాల్ తయారీ
-
500 మందికి ఉద్యోగ అవకాశాలు.. శంకుస్థాపన సభలో సీఎం జగన్
వర్షాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా బియ్యం ముక్కలైపోయినా, పాడైపోయినా సరైన ధర అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు జరుగుతోందని సీఎం జగన్ తెలిపారు. ఇథనాల్ ప్లాంట్ తో రైతులకు మరింత లబ్ధి చేకూరనుందని ప్రకటించారు. పంట పండించిన ఏ ఒక్క రైతు నష్టపోకుండా చూడటమే ప్రభుత్వ అంతిమ ధ్యేయమని వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలోని గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద రూ.270 కోట్లతో టెక్ మహీంద్ర గ్రూప్ కు చెందిన అసాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు సీఎం జగన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.
భూమి పూజ అనంతరం టెక్ మహీంద్ర సీఈఓ సీపీ గుర్నానీతో కలిసి బహిరంగ సభలో మాట్లాడారు. దేవుడి దయతో ఈ రోజు రైతులు, పర్యావరణ సమతుల్యత సాధించే ఓ మంచి క్యాక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. రూ.270 కోట్లతో టెక్ మహీంద్రా గ్రూప్ ఇథనాల్ను ప్లాంట్ తో రైతులు, నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాలయ్యే ఈ ప్లాంట్ లో బ్రోకెన్ రైస్ (విరిగిపోయిన బియ్యం) తో ఇథనాల్ తయారీ చేస్తారని తెలిపారు. పాడైపోయిన ఆహారధాన్యాలు, నూకలు, వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు వినియోగించి ఇథనాల్ను తయారు చేయడంతో రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని సీఎం పేర్కొన్నారు. ఇథనాల్ తో పాటు పశువుల దాణా, చేపల మేతకు ఉపయోగపడే ప్రోటీన్ ఫీడ్ ను బై ప్రోడక్ట్స్ కింద ఉత్పత్తి చేస్తారని పేర్కొన్నారు. దీంతో వర్షాల కారణంగా రంగు మారిన ధాన్యానికి కూడా మంచి ధర లభిస్తుందని సీఎం జగన్ తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు గుడివాడ అమర్ నాథ్, తానేటి వనిత, దాడిశెట్టి రాజా, వేణుగోపాలకృష్ణ, ఎంపీలు భరత్ రామ్, అనురాధ, వంగా గీత, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.
రోజుకు 200 లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి
రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుందని సీఎం జగన్ వివరించారు. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. దేశంలో ముడి చమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడంతో పాటు హరిత ఇంధన వినియోగాన్ని పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు. 2025–26 నాటికి ప్రతి లీటరు పెట్రోల్లో 20 శాతం బయో ఇథనాల్ మిశ్రమం కలపడాన్ని తప్పనిసరి చేస్తూ ఇటీవలే కేంద్రం ఉత్తర్వులు జారీచేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం లీటరు పెట్రోల్లో 8.41 శాతం ఇథనాల్ మిశ్రమం ఉంటుందని వివరించారు. కోటి లీటర్ల ఇథనాల్ను వినియోగించడం ద్వారా 20 వేల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతున్నట్లు పలు పరిశీలనల్లో వెల్లడి కావడంతో ఇథనాల్ ఉత్పత్తి రంగంలో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలిపారు. దీంతో అనేక సంస్థలు ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు.
6 నెలల్లో అన్ని అనుమతులు..
ఏపీలో పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని సీఎం జగన్ ప్రకటించారు. మహీంద్ర గ్రూప్ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలకు అన్ని అనుమతులు కేవలం 6 నెలల్లోనే మంజూరు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం, అవకాశాలు ఉన్నట్లు సీఎం పేర్కొన్నారు.
హరిత ఇంధన రంగంలో అగ్రగామిగా ఏపీ: సీఈవో గుర్నానీ
భూ కేటాయింపుల దగ్గర నుంచి అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందని అసాగో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశీష్ గుర్నానీ తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా హరిత పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందన్నారు. భవిష్యత్లో ప్రత్యామ్నాయ ఇంధన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్లాంట్ లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సీఈఓ ప్రకటించారు.