
cm jagan
ప్రగతి అనేది కేవలం అంకెల రూపంలో చూపడం కాదు, వాస్తవ రూపంలో ఉండాలన్నారు సీఎం జగన్. ప్రతి అంశంలో కూడా సాధించాల్సిన ప్రగతిపై క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన, పర్యవేక్షణ చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో.. ప్రభుత్వం గొప్ప వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. అలాంటి గ్రామ, వార్డు సచివాలయాల నుంచి నిరంతర పర్యవేక్షణ, చేస్తున్న ప్రగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడం అన్నది చాలా ముఖ్యం అన్నారు. లేకపోతే సుస్థిర ప్రగతి లక్ష్యాలను చేరుకునే ప్రయాణంలో వాస్తవికత దూరం అవుతుందన్నారు. సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఆధార్ కార్డు నంబరు, వివరాలతో సహా డేటా నిక్షిప్తం చేయడంతోపాటు .. వచ్చిన మార్పులను చెప్పగలిగేలా ప్రగతి కనిపించాలన్నారు సీఎం జగన్. ఏమైనా సమస్యలు ఉంటే.. వాటిని గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే గుర్తించి పరిష్కారాలు కూడా చూపాలని సూచించారు.
“ఉదాహరణకు రక్తహీనతను నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ అమలు చేస్తున్నాం. వీటిని అందుకుంటున్న మహిళల ఆరోగ్యంపై పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలి. వారికి సరైన ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే నిశిత దృష్టి ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ఆ స్థాయిలో బాధ్యత, జవాబుదారీతనం ఉండాలి”
– సీఎం జగన్
లక్ష్యాల సాధనకు గ్రామ, వార్డు సచివాలయాలు చోదక శక్తిలా ఉపయోగపడాలన్నారు సీఎం జగన్. సుస్ధిర లక్ష్యాల సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు యూనిట్గా ఉండాలన్నారు. సచివాలయాల్లో సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణకు మండలాల వారీగా వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఉండాలన్నారు. వీరు సచివాయాల్లోని ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ చేయాలన్నారు. దీనికి సంబంధించి ఎస్ఓపీలను రూపొందించుకోవాలన్నారు. ప్రభుత్వంలో ప్రతి విభాగానికి చెందిన విభాగాధిపతి ప్రతినెలలో రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలని పేర్కొన్నారు. ఆ శాఖకు చెందిన సచివాలయ ఉద్యోగులు ఏరకంగా పనిచేస్తున్నారు, ప్రగతి లక్ష్యాల సాధన దిశగా ఏ రకంగా పనిచేస్తున్నారు అన్నది పరిశీలన చేయాలని ఆదేశించారు. దీనివల్ల సిబ్బందికి సరైన మార్గదర్శకత్వం లభిస్తుందన్నారు. అంతేకాక ఎప్పటికప్పుడు వివరాల నమోదు కూడా సమగ్రంగా జరుగుతుందా? లేదా? అన్నదానిపై కూడా పరిశీలన, పర్యవేక్షణ జరుగుతుందన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వాస్తవిక రూపం దాల్చిన అంశాలకు సంబంధించి వివరాల నమోదు ఎలా జరుగుతుంది? అన్న విషయంపై జేసీలు, కలెక్టర్లు కూడా పరిశీలన చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనివల్ల సచివాలయాల సిబ్బందిలో మెరుగైన పనితీరు కనిపిస్తుందన్నారు. అంతేకాదు ప్రగతి లక్ష్యాల సాధనలో మనం అడుగులు ముందుకుపడతాయని, తద్వారా దేశంలో రాష్ట్రం నంబర్ వన్గా నిలుస్తుందన్నారు.
నెలకు కనీసం రెండు సచివాలయాలను ప్రభుత్వ విభాగాధిపతులు పర్యవేక్షించాలన్నారు సీఎం జగన్. వ్యవసాయం, విద్య, మహిళ శిశు సంక్షేమం, ఆరోగ్యం తదితర రంగాల్లో మనం ఖర్చు చేస్తున్నట్టుగా దేశంలో ఏ ప్రభుత్వంకూడా ఖర్చు చేయడం లేదన్నారు. అందుకనే ఓనర్షిప్ తీసుకుని వాటిని సమగ్రంగా పర్యవేక్షణ చేయాల్సి అవసరం ఉందన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మహిళా,శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, ప్లానింగ్ సెక్రటరీ విజయ్కుమార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, పాఠశాల మౌలికవసతుల కమిషనర్ కాటమనేని భాస్కర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ జె నివాస్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి సంపత్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ సిరి, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.