
cm jagan review
- మహిళా, శిశు సంక్షేమశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్
బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత, చిన్నారుల్లో పౌష్టికాహారలోపం నివారించడానికి మరిన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నిర్దేశించుకున్న ప్రమాణాలతో అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్నిఅందించడానికి పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు పూనుకుంది. పర్యవేక్షణ కోసం.. ప్రత్యేక యాప్ ను జగన్ సర్కారు రూపొందించనుంది. మహిళా, శిశు సంక్షేమశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలో ఇలాంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అంగన్వాడీల్లో పిల్లలకు ఇచ్చే ఆహారంలో క్వాలిటీ, కచ్చితమైన క్వాంటిటీ ఉండాలన్నారు. ప్రతిరోజూ నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. దీనికోసమే దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న సూపర్వైజర్ల నియామకాలను ప్రారంభించామన్నారు. దురదృష్టవశాత్తూ కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. వీలైనంత త్వరగా ఈ పోస్టుల భర్తీని పూర్తిచేయాలని ఆదేశించారు జగన్.
“అక్టోబరులో నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం.. నూటికి నూరుపాళ్లు క్వాలిటీ, క్వాంటిటీ ఆహారం పిల్లలకు అందాలి. అంగన్వాడీల్లో టాయిలెట్ల పరిశుభ్రతపైనా దృష్టిపెట్టాలి. సొంత భవనాల్లోనే కాకుండా అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీల్లో కూడా కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ మేరకు కార్యాచరణ సిద్ధంచేసుకోవాలి” – సీఎం జగన్
అంగన్వాడీల్లో నాడు – నేడు ద్వారా సమగ్రాభివృద్ధి చేయాలన్నారు సీఎం జగన్. పాఠశాల విద్యాశాఖతో కలిసి ఈమేరకు కార్యాచరణ చేసుకోవాలన్నారు. అంగన్వాడీల రూపురేఖలను సంపూర్ణంగా మార్చాలన్నారు. అంగన్వాడీల్లో ప్రస్తుత పరిస్థితులు ఏంటి? ఎలాంటి సదుపాయాలు కల్పించుకోవాలి? ఏ రకంగా వాటిని తీర్చిదిద్దాలి? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రణాళిక తయారు చేసుకోవాలని ఆదేశించారు. విడతల వారీగా ఆ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు.
పిల్లలకు ఇచ్చే ఆహారం పాడవకుండా చూసేందుకు ఎలాంటి విధానాలు అనుసరించాలన్నదానిపై కూడా దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. పిల్లలు రోజూ తీసుకునే పాలు, గుడ్లులాంటివి పాడవకుండా నిల్వచేసే విధానాలపైనా కూడా దృష్టిపెట్టాలన్నారు. అంగన్వాడీల్లో ప్రతిచోటా ఫ్రిడ్జ్ ఏర్పాటు దిశగా ఆలోచన చేయాలన్నారు. స్కూళ్లకు, అంగన్వాడీలకు సరఫరాచేసే ఆహారంపై నాణ్యత, పర్యవేక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
డిసెంబర్1 నుంచి పౌష్టికాహార పంపిణీ బాధ్యతలను మార్క్ఫెడ్ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. దీన్ని ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షించనున్నారు. నవంబరు నుంచి నుంచి గుడ్ల పంపిణీపై కూడా యాప్ ద్వారా పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆహార నాణ్యత బాగుందా? లేదా? అన్నదానిపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ పర్యవేక్షణ చేయించనున్నట్లు వివరించారు. ఈలోగా పంపిణీ అవుతున్న ఆహారం క్వాలిటీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. క్వాలిటీ, క్వాంటిటీపై యాప్ల ద్వారా సమగ్ర పర్యవేక్షణ ఉండాలన్నారు. అంగన్వాడీల పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజి క్లినిక్స్ ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలకు వైద్య సహాయమే కాకుండా, ఆ పిల్లలకు పౌష్టికాహారం మరింత పెంచేలా తగిన ఆలోచనలు చేయాలన్నారు. దీనివల్ల రక్తహీనత, శారీరక బలహీనతలను మొదటి దశలోనే నివారించే అవకాశం ఉంటుందన్నారు. అంగన్వాడీలపై సూపర్వైజర్ల పర్యవేక్షణ జియోట్యాగింగ్ చేయాలన్నారు.