
cm jagan review
ఎస్ఐపీబీలో గ్రీన్సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులు వీలైనంత త్వరగా ప్రారంభమయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు. అన్నిరకాలుగా ఆయా సంస్థలకు చేయూతనివ్వాలన్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎస్ఐపీబీలో గ్రీన్సిగ్నల్ ఇచ్చిన పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఆ విభాగంలో సీఎస్, సీఎంఓ అధికారులు ఉండేలా చూడాలన్నారు. అనుమతుల్లో జాప్యంలేకుండా నిర్ణీత కాలవ్యవధిలోగా వాటికి క్లియరెన్స్ ఇచ్చేలా చూడాలన్నారు.
పోర్టులు, ఫిషింగ్ హార్భర్ల నిర్మాణంపై..
రామాయపట్నం పోర్టులో మార్చి 2024 నాటికి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయని సీఎం జగన్ కు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 2023 డిసెంబరు నాటికి పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. మొదటి విడతలో నిర్మించనున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్భర్ల పనుల ప్రగతిని సీఎం సమీక్షించారు. 2023 జూన్ నాటికి ఇవి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. రెండో దశలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని ఆదేశించారు.
డిసెంబరు నాటికి ఇంటర్నెట్..
డిసెంబరు నాటికి అన్ని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్లు వీటన్నింటికీ కూడా ఫైబర్తో అనుసంధానంచేసి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని సీఎం జగన్ సూచించారు. డిజిటల్ లైబ్రరీలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తాయన్నారు. వైఎస్సార్ జిల్లా వేల్పులలో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ ద్వారా సుమారు 30 మంది అక్కడనుంచే ఐటీ ఉద్యోగాలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ లైబ్రరీలు వస్తే.. తమ సొంత గ్రామాలనుంచే మెరుగైన ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుందన్నారు. అందుకే డిజిటల్ లైబ్రరీల ద్వారా వర్క్ఫ్రం హోం కాన్సెఫ్ట్ను బలోపేతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోనే ఇదొక వినూత్న వ్యవస్థ అవుతుందన్న సీఎం.. చాలామందికి ఆదర్శనీయంగా నిలుస్తుందన్నారు.
5జీ సేవలను గ్రామాలకు చేరవేయడంలో ఏపీఎస్ఎఫ్ఎల్ కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. దీనికోసం టెలికాం దిగ్గజాలతో కలిసి పనిచేస్తున్నామని వివరించారు.
ప్రతి జిల్లాలో 2 క్లస్టర్ల చొప్పున
పారిశ్రామిక ప్రగతిపై జరిగిన రివ్యూ నేపథ్యంలో అధికారులు సీఎం జగన్ కు కీలక విషయాలను వెల్లడించారు. ప్రతి జిల్లాలో 2 క్లస్టర్ల చొప్పున ఎంఎస్ఎంఈలను నెలకొల్పేందుకు కృషిచేస్తున్నామని అధికారులు తెలిపారు. అనంతరం సీఎం జగన్ స్పందించారు. పరిశ్రమలు ప్రారంభం కావడమే కాదు, వాటిని నిలబెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అధికంగా ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలకు చేదోడుగా నిలవాలని సూచించారు.
వీటివల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుందని, తద్వారా నిరుద్యోగం తగ్గుతుందన్నారు. ఎంఎస్ఎంఈలకు అత్యధిక ప్రాధాన్య ఇవ్వాలన్న సీఎం.. అవి నిలదొక్కుకునేలా వాటికి నిరంతరం చేయూతనివ్వాలన్నారు. ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ను క్రియాశీలం చేయాలని సీఎం ఆదేశించారు. ఇతర దేశాల్లో ఎంఎస్ఎంఈ సెక్టార్పై ఒక పరిశీలన చేయాలన్నారు. వాటికి ఏపీ ఒక వేదికగా నిలిచేలా ఆలోచన చేయాలన్నారు. ఏయే రంగాల్లో ఎంఎస్ఎంఈలు నడుస్తున్నాయి, వాటిని ఇక్కడకు తీసుకురావడం ద్వారా ఇక్కడి వారికి ఆదాయాలు, ఉద్యోగాల కల్పన ఏరకంగా చేయవచ్చో ఆలోచన చేయాలన్నారు సీఎం జగన్.
ఇండస్ట్రియల్ కారిడార్లపైనా..
విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఇప్పటికే ఉన్న పారిశ్రామిక నోడల్స్ను అభివృద్ధిచేయడంతో పాటు మచిలీపట్నం నోడ్, దొనకొండ నోడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు.. సీఎం జగన్ కు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ స్పందించారు. భావనపాడు నోడ్ను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే రామాయపట్నం నోడ్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. పోర్టులను ఆసరాగా చేసుకుని, పోర్టు అనుబంధ పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలన్నారు.
ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలికసదుపాయాలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ సమీర్ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాలవలవెన్, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి సృజన, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ఎన్ భరత్ గుప్తా, ఏపీ మారిటైం బోర్డు సీఈఓ షన్మోహన్, ఏపీ ఫైబర్నెట్ ఎండీ మధుసూధన్రెడ్డి, మారిటైం బోర్డు ఛైర్మన్ కాయల వెంకటరెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐడీసీ ఛైర్పర్సన్ బండి పుణ్యశీల, ఏపీటీపీసీ ఛైర్మన్ కె రవిచంద్రారెడ్డి, ఏపీఎండీసీ ఛైర్ పర్సన్ షమీమ్ అస్లాం, ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరు గౌతమ్రెడ్డి, ఇండస్ట్రియల్ ప్రమోషన్ సలహాదారు రాజీవ్ కృష్ణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ సలహాదారు లంక శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.