
లావాదేవీల ప్రక్రియలో చెక్కుల ప్రధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఇవి ఎంతో కీలకమైనవి. అయితే ఫోర్జరీ లాంటి మోసాలకు ఆస్కారం లేకుండా .. చెక్కుల భద్రత కోసం ఇప్పుడు పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్) అందుబాటులోకి వచ్చింది.
రూ.5 లక్షలు అంతకంటే.. అధిక విలువ చెక్కులకు చెల్లింపులు చేసేముందు ఖాతాదారుల నుంచి బ్యాంకులు పీపీఎస్ నిర్ధరణ కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఆగస్టు 1న అమల్లోకి వచ్చింది. ఆర్బీఐ ఇప్పటికే దీని మార్గదర్శకాలను జారీ చేయగా.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. పీపీఎస్ ను అభివృద్ధి చేసింది.
చెక్కుల ట్యాంపరింగ్ కారణంగా జరిగే మోసాలను అరికట్టేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆర్బీఐ వెల్లడించింది. పీపీఎస్ నిర్ధారణ కింద ఖాతాదారులు చెక్కు నెంబరు, తేదీ, మొత్తాన్ని అంకెలు, అక్షరాల్లో తెలియజేయాలి. చెక్కును తీసుకున్న వ్యక్తి పేరు, లావాదేవీ కోడ్ను బ్యాంక్కు తెలపాలి. వివరాలను ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా రోజులో ఎప్పుడైనా.. లేదా సంబంధిత బ్యాంకు శాఖ, సేవా కేంద్రంలో (పనివేళల్లో) నమోదు చేయొచ్చు. చెక్కు చెల్లింపు కోసం వచ్చినప్పుడు బ్యాంకు అన్ని వివరాలూ ధ్రువీకరించుకొని, ఏ విధమైన వ్యత్యాసం లేకుంటే.. దాన్ని క్లియర్ చేస్తుంది. ఒకసారి నమోదు చేసిన తర్వాత వాటిని మార్చడం కుదరదు.