
నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ!’ సినిమాపై తన అభిప్రాయన్ని వెల్లడించారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ‘పరుచూరి పాఠాలు’ పేరుతో ప్రస్తుత సినిమాలపై తన అభిప్రాయాలను పంచుకొంటున్నారు ఆయన. తాజాగా ‘అంటే సుందరానికీ’ చిత్రం ఆశించినంత విజయం సాధించకపోవడానికి కారణాలపై తనదైన శైలిలో విశ్లేషించారు.
ఈ సినిమా విషయంలో దర్శకుడు తీసుకున్న పాయింట్ బాగుందని, స్క్రీన్ప్లే బాగా లేకపోవడం వల్లే.. ఈ సినిమా కొంచెం గాడి తప్పిందన్నారు. మతాంతర ప్రేమకథా స్టోరీలైన్తో వచ్చిన ఈ సినిమా ఆ పాయింట్ను విస్మరించిందని అభిప్రాయపడ్డారు. స్క్రీన్ప్లేలో ఫ్లాష్ బ్యాక్ సీన్లు, మలుపులు ఎక్కువయ్యాయని, ఇలాంటి సీన్లు ఎక్కువయితే ప్రేక్షకులు మూడు గంటలపాటు థియేటర్లలో ఉండటానికి ఇష్టపడరని చెప్పారు. కథకు అవసరం లేని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు అంతగా నచ్చవని తెలిపారు.
మూడుగంటల పాటు ప్రేక్షకుల్ని కథలో లీనం చేసేలా స్క్రీన్ప్లే ఉండాలన్నారు. అయితే ఈ సినిమాలో నటీనటులు అద్భుతంగా నటించారని పరుచూరి కితాబిచ్చారు. ముఖ్యంగా కథానాయకుడు నాని నటన చాలా సహజంగా ఉంటుందని, ఈ సినిమాలో కూడా బాగా నటించాడని అభినందించారు.