
జయంతి నాటికి సిద్ధం | అక్కడే కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు
రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం విజయవాడ నగరం నడిబొడ్డున ఏర్పాటు కాబోతోంది. నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చూసినా కనిపించే విధంగా 125 అడుగుల భారీ విగ్రహాన్ని నిలబెట్టనున్నారు. అందుకు సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో విగ్రహాన్ని నిలబెట్టేందుకు అవసరమైన పిల్లర్ నిర్మాణం కొనసాగుతోంది.
స్వాతంత్ర్యోద్యమ సమయంలో మహాత్మా గాంధీ విజయవాడలో పర్యటించారు. ఆ సమయంలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్కు స్వరాజ్ మైదానంగా నామకరణం చేశారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతాన్ని ‘డా. బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్’గా పిలవనున్నారు. ప్రజలందరూ ఆరాధించే అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఆహ్వానించాయి.
విగ్రహంతోపాటు కన్వెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే విశాలమైన ఆ ప్రాంతంలో చక్కటి పచ్చదనంతో నింపనున్నారు. పార్క్ తరహా వాతావరణాన్ని సిద్ధం చేసి ఆహ్లాదకరంగా మార్చనున్నారు. మహాత్మాగాంధీ రోడ్డులో బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, రాజ్ భవన్కు సమీపంలో ఏర్పాటు కాబోతున్న అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ నగర వాసులను ఆకట్టుకోనుంది. అలాగే విజయవాడ, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలతోపాటు ఇది కూడా ఒక పర్యాటక ప్రదేశంగా పేరు పొందుతుంది.
అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 11న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని నిర్మాణ కమిటీ నిర్ణయించింది. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. గుజరాత్లో ఏర్పాటైన సర్దార్ వల్లభభాయి విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’కి జాతీయ స్థాయిలో ప్రచారం వచ్చింది. త్వరలో ఏపీలో ఏర్పాటవుతున్న అంబేద్కర్ విగ్రహానికీ అంతటి ప్రచారం వస్తుందని చెబుతున్నారు.